స్థానిక ఎన్నికలపై ఈసీదే తుది నిర్ణయం:సుప్రీం

దిల్లీ, మార్చి18: స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ను బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే, జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాను కొనసాగించాలని ధర్మాసనం సూచించింది. ఎన్నికలు ఎప్పుడు నిర్ణయించాలనేది రాష్ట్ర ఎన్నికల సంఘానిదే తుదినిర్ణయమని స్పష్టం చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎన్నిక కోడ్‌ ఎత్తివేయాలని సూచించింది. ఎన్నికల ప్రవర్తన నియమావళిని సుప్రీంకోర్టు రద్దు చేసింది.  రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించకుండా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఏకపక్షంగా ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలంటూ ఏపీ ప్రభుత్వం సోమవారం పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదే కేసులో మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కేవియట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.