చెర్నోబిల్ అణు రియాక్టర్ సమీపంలో అగ్ని ప్రమాదం.. ప్రమాదకర స్థాయికి రేడియేషన్

ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రం సమీపంలోని అటవీ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పెను ప్రమాదం పొంచి ఉండడంతో రష్యా అధికారులు యుద్ధ ప్రాతిపదికన మంటలను అదుపుచేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. 1986 ఏప్రిల్ 25న ఈ అణు విద్యుత్ కేంద్రంలో ఓ ప్రయోగం విఫలమై నాలుగో రియాక్టర్‌లో భారీ పేలుడు సంభవించింది. పెను విధ్వంసం సృష్టించిన ఈ ఘటనను ప్రపంచంలోనే అత్యంత విధ్వంసకర అణు ప్రమాదంగా పేర్కొంటారు


తాజాగా, చెర్నోబిల్ అటవీ ప్రాంతంలోనే భారీ అగ్ని ప్రమాదం సంభవించడంతో ఆందోళన నెలకొంది. అగ్ని ప్రమాదంతో రేడియేషన్‌ స్థాయి సాధారణం కంటే 16 రెట్లు పెరిగిపోయిందని అధికారులు ప్రకటించారు. చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రం సమీపంలో ఉండే ఈ అటవీ ప్రాంతంలో చెలరేగుతున్న మంటలను అదుపుచేయడానికి రెండు విమానాలు, ఓ హెలికాప్టర్‌, 130 మంది అగ్నిమాపక సిబ్బంది, 21 వాహనాలు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

శనివారం ఈ మంటలు అంటుకోగా ఇప్పటివరకు అణు విద్యుత్‌ కేంద్రం సమీపంలో దాదాపు 250 ఎకరాలలో మంటలు వ్యాపించాయి. 'ఇదో చేదు వార్త. రేడియేషన్‌ స్థాయి సాధారణ స్థాయి కంటే పెరిగిపోయింది' అని అక్కడి ఓ అధికారి వ్యాఖ్యానించారు. రేడియేషన్‌ స్థాయి పెరిగిపోవడంతో మంటలు అదుపు చేసేందుకు కూడా ఇబ్బందులు తలెత్తున్నాయి.

మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు కొసాగుతున్నాయని, సమీప ప్రాంతాల్లోని ప్రజలకు ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు ప్రకటించారు. కాగా, మంటలు అదుపులోకి వచ్చాయని, రేడియేషన్ స్థాయిలు సాధారణ స్థితికి చేరుకున్నాయని రష్యా ఎమర్జెన్సీ సర్వీసెస్ ప్రకటించింది. అంతేకాదు, కేవలం 20 హెక్టార్ల విస్తీర్ణంలోనే మంటలు వ్యాపించాయని తెలిపింది. ఏప్రిల్ 4న రాత్రివేళ మంటలు వ్యాపించాయని, ప్రస్తుతం అక్కడ ఎలాంటి ముప్పులేదని పేర్కొన్నారు.