ఏపీలో తొలిరోజు మద్యం విక్రయాల అంచనా రూ.40 కోట్లు!

ఏపీలో తొలిరోజు మద్యం విక్రయాలు ఇవాళ రాత్రి ఏడు గంటలతో ముగిశాయి. తొలిరోజు   రూ.40 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్టు అంచనా. ఏపీలో అధికారికంగా మొత్తం 3,468 దుకాణాలు ఉన్నాయి. ఈ రోజు 2,345 మద్యం దుకాణాలను తెరిచారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లాలో మాత్రం మద్యం దుకాణాలు తెరవలేదు.


కాగా, ఈ రోజు ఉదయం 11 గంటలకు మద్యం షాపులు తెరిచి రాత్రి  7 గంటల వరకు విక్రయాలు కొనసాగించారు. మద్యం కోసం మందుబాబులు బారులు తీరారు. ఏపీ, తమిళనాడు సరిహద్దు గ్రామాల్లోని మద్యం దుకాణాల వద్దకు తమిళనాడు వాసులు రావడంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. నెల్లూరు, చిత్తూరు జిల్లాలలో ఈ పరిస్థితులు నెలకొనడంతో ఆయా దుకాణాల్లో మద్యం విక్రయాలను అధికారులు నిలిపివేశారు.


కాగా నేటి నుంచి మరో 50 శాతం మద్యం రేట్లు ప్రభుత్వం పెంచింది. ఇప్పటికే 25 శాతం పెంచగా, తాజాగా మరో 50 శాతం పెంచింది. దీంతో మద్యం ధరలు 75 శాతం  పెంచినట్టయింది. ఈ పరిణామం మందుబాబులకు మింగుడుపడడం లేదు. ధరలు పెంపు మద్యపాన నిషేధంలో భాగమే అని ప్రభుత్వం చెబుతోంది. ఐతే మద్యం ప్రియులు మాత్రం ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.