రైట్ ...  రైట్ 



     రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు తిప్పడంపై సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మొదట కొన్ని నగరాల గుండా బస్సు సర్వీసులు నడపాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల పునరుద్ధరణపై జగన్ సర్కార్ కసరత్తు ముమ్మరం చేసింది. రాష్ట్రంలో, అంతర్రాష్ట్రంగా బస్సులు నడిపేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసిన నేపథ్యంతో దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చర్చించింది. కరోనాపై సమీక్షలో భాగంగా ఆర్టీసీ బస్సులు నడపడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రధానంగా చర్చించారు. మంత్రులు ఆళ్ల నాని, కన్నబాబు, ఇతర ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.


     ఇందులో భాగంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారిని స్వరాష్ట్రానికి తీసుకొచ్చే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యంగా హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు నుంచి తొలుత ఆర్టీసీ బస్సులు నడపాలని నిర్ణయించినట్లు తెలిసింది. దశలవారీగా ఈ సంఖ్య పెంచాలని యోచిస్తున్నట్లు సమాచారం. అలాగే బస్టాండ్‌ నుంచి బస్టాండ్‌ వరకు మాత్రమే నడపాలని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది. మధ్యలో ఎక్కడా ప్రయాణికులను ఎక్కించుకోవడం, దింపకూడదని నిర్ణయించినట్లు సమాచారం. అలా వచ్చిన వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే వారి పూర్తి వివరాలూ సేకరించనున్నారు. బస్సుల్లో ప్రయాణించే వారు తప్పనిసరిగా మాస్కులు ధరించేలా, భౌతిక దూరం పాటించేందుకు సగం సీట్లతోనే బస్సులు నడపాలని నిర్ణయించినట్లు తెలిసింది.


     వీటిపై విధివిధానాల రూపకల్పన చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. వలస కార్మికుల తరలింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత రాష్ట్రంలో బస్సు సర్వీసులు నడపాలని జగన్‌ నిర్ణయించారు. దీనిపై విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సగం సీట్లు మాత్రమే నింపి బస్సులు నడపాలని, ప్రైవేట్‌ బస్సులు కూడా అనుమతినివ్వాలని సీఎం నిర్ణయించారు. ప్రైవేటు బస్సులు, రాష్ట్రంలో బస్సుల తిప్పే అంశంపై కూడా మూడు నాలుగు రోజుల్లో విధివిధానాలు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.