పాలిమర్స్ కంపెనీ మూసివేయండి - స్థానికుల ఆందోళన


 


 



విశాఖలోని ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్యాస్‌ లీకేజిపై స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. కంపెనీ వెంటనే మూసివేయాలంటూ పెద్ద ఎత్తున ఇవాళ జనం కంపెనీ వద్దకు చేరుకున్నారు. గ్యాస్ లీకేజీ ఘటనపై విచారణ పేరుతో నామమాత్రపు చర్యలు తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. గ్యాస్ లీక్ ఘటనకు కారకులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటివరకు కంపెనీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడుతున్నారు. విశాఖలో ఎల్‌జి పరిశ్రమను అక్కడి నుండి తొలగించాలని వామపక్షాల ఆధ్వర్యంలో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో గ్రామస్థులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటారంటూ ప్రశ్నిస్తున్నారు.


మరోవైపు గ్యాస్ లీకేజీ జరిగిన విశాఖలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలో నేడు డిజిపి గౌతమ్‌ సవాంగ్‌ పర్యటించనున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గ్యాస్‌ లీకేజ్‌ బాధితుల్ని కూడా ఆయన పరామర్శించనున్నారు. గ్యాస్‌ లీకేజ్‌ ప్రాంతంలో పరిస్థితులను డీజీపీ పర్యవేక్షించనున్నారు. విశాఖలో జరిగిన ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ ప్రమాదంలో ఇప్పటివరు 12 మంది మృతి చెందారు. మరికొందరు నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో చిన్నారి కూడా ఉండటం అందరి హృదయాల్ని కలిచివేస్తోంది. పెద్ద ప్రమాదం జరిగినా రాష్ట్ర ప్రభుత్వం మరణాలు ఎక్కువగా లేకుండా జాగ్రత్త పడిందని చెప్పాలి. అధికారులు అప్రమత్తం అవ్వడంతో మరణాల సంఖ్య తగ్గింది.

అయితే ఈ దుర్ఘటనలో గ్రీష్మ అనే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. మరోవైపు ఆమె తల్లి తండ్రులు కూడా గ్యాస్ బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మార్చురీ నుంచి 5 మృత దేహాలను అధికారులు ఇవాళ స్వస్థలాలకు పంపించారు. దీనితో గ్రీష్మ మృతదేహం చూసిన ఆమె పిన్ని బాబాయ్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చిన్నారి తల్లి తండ్రులకు కూడా హె కడ చూపు దక్కకపోవడం స్థానికుల చేత కూడా కంటతడి పెట్టిస్తోంది.